టికెట్ ధరలపై కొత్త కమిటీ.

సినిమా టికెట్ ధరలు నిర్ణయించే విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ గత ఏడాది డిసెంబరు 27 ప్రభుత్వం జీవో 144 జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. కమిటీ డిసెంబరు 31న ఒకసారి భేటీ అయ్యిందని, ఈ నెల జనవరి 11 మరోసారి సమావేశమవుతుందని తెలిపారు. టికెట్ ధరల విషయంలో ఫిబ్రవరి మొదటి వారానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో 35 విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదిర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోమవారం జరిగిన విచారణ లో థియేటర్ యాజమాన్యాల తరఫున న్యాయవాది వి.వి.సతీష్ వాదనలు వినిపిస్తూ.. థియేటర్ యాజమాన్యాలు ఇచ్చే ప్రతిపాదనలు స్వీకరించేందుకు లైసెన్సింగ్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) నిరాకరిస్తున్నారన్నారని, దీంతో రిజిస్టర్ పోస్టులో ప్రతిపాదనలు పంపించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... అలా అయితే అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

Share this on your social network: