మచిలీపట్నం కేంద్రమైన కృష్ణాజిల్లాలోకి విజయవాడ విమానాశ్రయం
నాటి బ్రిటీష్ పాలకులు అప్పటి విజయవాడ భౌగోళిక పరిస్థితులను చూసి.. విస్తరించటానికి అనువుగా ఉన్న ప్రాంతం కాబట్టి గన్నవరాన్ని విమానాశ్రయ నిర్మాణానికి ఎంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ విమానాల కార్యకలాపాలకు దీనిని వినియోగించారు. తిరిగి 90వ దశకం నుంచి తన ఉనికిని చాటుకుంటూ దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్పోర్టులను తలదన్నేలా తయారైంది. అనంతరం నవ్యాంధ్రకే నెంబర్వన్ విమానాశ్రయంగా మారింది. విజయవాడ స్థాయిని ప్రపంచ పటంలో ఆవిష్కృతం చేసింది. అలాంటి విమానాశ్రయాన్ని కృష్ణాజిల్లాలో కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే ఉంచితే బాగుండన్న డిమాండ్ వినిపిస్తోంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలు అమరావతి రాజఽధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి. ఈ రెంటికీ దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయంగా విజయవాడ విమానాశ్రయం ఉంది. గడిచిన కాలంలో రూ.1,800 కోట్లతో అభివృద్ధి చెందింది. ఇంటీరియం టెర్మినల్, రోడ్ల విస్తరణ, బ్యూటిఫికేషన్, అదనపు పార్కింగ్ బేలు, టాక్సీస్టాండ్లు, ఫైర్ పైటింగ్ వ్యవస్థలు, రన్వే విస్తరణ వంటి ఎన్నో పనులు జరిగాయి. కార్గో టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్ అభివృద్ధి చెందాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాల కోసం రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపడుతున్నారు. దీనికి అనుగుణంగా విమానాల పార్కింగ్ కోసం ఆప్రాన్ను కూడా నిర్మించారు. ఇలాంటి ఎయిర్పోర్టు విజయవాడ నగరానికి ఉంటుందనుకుంటే, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాలో కలిపారు.
విజయవాడను భవిష్యత్తులో గ్రేటర్ సిటీ, అనంతరం మెగాసిటీగా మారే అవకాశాలున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం, కొండపల్లి, తాడిగడప మునిసిపాలిటీలను చేశారు. ఇప్పుడు విస్తరణ దృష్టంతా నున్న, కొండపావులూరు, గన్నవరం ప్రాంతాలపై పడింది. విజయవాడలో విలీనం కావటానికి గన్నవరంలోని గ్రామాలు అంగీకార పత్రాలు కూడా ఇచ్చాయి. గన్నవరం ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏరియా పరిధిలోకి వస్తుంది. తాజా జిల్లాల మార్పుతో గన్నవరం మండలాన్ని గుడివాడ ఆర్డీవో పరిధిలోకి తీసుకొచ్చారు. గన్నవరం ప్రాంత ప్రజలకు విజయవాడ 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కలెక్టరేట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Share this on your social network: