2లక్షల కిలోల గంజాయి కాల్చేసిన పోలీసులు

రాష్ర్టాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. పలు జిల్లాల్లో సీజ్ చేసిన రెండు లక్షల కిలోల పొడి గంజాయిని ‘ఆపరేషన్ పరివర్తన’ కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో డీజీపీ దగ్గరుండి దహనం చేయించారు. దీని విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గంజాయి దహన కార్యక్రమం సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సీఎం ఆదేశాల మేరకు గత ఏడాది ఆపరేషన్ పరివర్తనకు శ్రీకారం చుట్టి, ఏవోబీ సరిహద్దుల్లో ఒడిసాతోపాటు విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి సరఫరా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 120 అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా, స్థిర, డైనమిక్ వాహన చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. గంజాయి తోటలను స్వచ్ఛందంగా ధ్వంసం చేసిన పలువురు గిరిజనులకు రూ.10 వేలు చొప్పున అందించి సత్కరించారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ ఆర్కే మీనా, ఎస్ఈబీ కమిషనర్ వినిత్ బ్రిజ్లాల్, విశాఖ రేంజి ఐజీ కేఎల్వీ రంగారావు, రైల్వేస్ డీఐజీ రమేష్రెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this on your social network: