కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పెనుబల్లి యువకుడు

పేదరికంలో పుట్టిన ఆ గిరిజన యువకుడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు. క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన ఆ యువకుడు పట్టు విడవకుండా పర్వతారోహణ చేశాడు. పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన గిరిజన యువకుడు బర్మావత్ మోతి ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని బుధవారం అధిరోహించి తన సత్తా చాటాడు. ఈ మేరకు అక్కడి అధికారులనుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. అతడి తల్లిదండ్రులు తోపుడుబండ్లపై పండ్లు జీవనం సాగించే వారు కాగా పూటగడవటం కూడా కష్టమైన కుటుంబం నుంచి వచ్చిన మోతికుమార్ చిన్ననాటినుంచి క్రీడల్లో రాణిస్తున్నాడు. క్రీడల్లో ఉన్న పట్టుతో మోతికుమార్ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూనే యదాద్రి జిల్లా భవనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షణ పొందాడు. అక్కడ ఏగ్రేడ్ సర్టిఫికెట్ పొంది ఆఫ్రికలోని కిలీ మంజారో పర్వతరోహణకు అర్హత సాధించాడు. కానీ అక్కడకు వెళ్లేందుకు స్థోమత లేకపోవడంతో లంబాడా హక్కుల పోరాట సమితి, అనేక మంది దాతలు తోడుగా నిలవడంతో రూ.3.20లక్షలను కూడ కట్టుకొని ఆఫ్రికావెళ్లేందుకు సిద్ధమయ్యాడు. గతనెల 30న హైదరాబాద్ నుంచి బయల్దేరిన మోతికుమార్ ఈనెల 1న టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతశ్రేణి వద్దకు చేరుకున్నాడు. మంచుతో కూడుకున్న అగ్ని పర్వతమైన కిలిమంజారో ఎత్తు 5,895మీటర్లు (19,340అడుగులు) ఉండగా.. మూడురోజులపాటు రాత్రిపగలు కష్టపడి అధిరోహించాడు. మోతికుమార్ కిలిమంజారో పర్వతంపై పలు దేవతలు, లంబాడాల ఆరాధ్యదైవమైన సంతు సేవాలాల్, పలువురు మతపెద్దలు, దేశనాయకుల చిత్రపటాలతో పాటు తెలంగాణ పోలీస్ చిహ్నం, అతని గురువు మోహన్ ఫొటోను చూపి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మోతికుమార్ విజయవంతంగా పర్వతారోహణ చేశాడని తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వీఎంబంజర్ సర్పంచ్ భూక్యా పంతులీ, మాజీ సర్పంచ్ మంగునాయక్, అతడి తల్లిదండ్రులు అలివేలు, రాంజా, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు

Share this on your social network: