ఎచ్చెర్ల సభలో వైఎస్ జగన్ ధ్వజం
Published: Friday December 07, 2018

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చట్టం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బహిరంగ సభలో ప్రసంగించారు. ‘సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో ప్రచా రం చేశారు. అక్కడ ఎన్నికల పేరుతో ఇక్కడి ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. తెలంగాణలోపార్టీ ఫిరాయింపుదారులను చిత్తుగా ఓడించాలని పిలుపిచ్చారు.
మరి ఆంధ్రప్రదేశ్లో మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారు? అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంత అన్యాయం చేసి తెలంగాణలో మాత్రం ఫిరాయింపులు తప్పని ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? మాట్లాడితే హైదరాబాద్ను తానే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెబుతున్నారు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించి పూర్తిచేసినవే. ఐటీ రంగంలో చంద్రబాబు హయాంలో కంటే నా తండ్రి పాలనలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది’ అని చెప్పారు. మరో 3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. 4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని.. కానీ రుణమాఫీ, డ్వాకా మహిళలకు పసుపుకుంకుమ డబ్బులు కూడా చంద్రబాబు చెల్లించలేదని జగన్ విమర్శించారు.
ఎన్నికల హామీలకు తూట్లు పొడిచారని అన్నారు. ఖరీఫ్ కు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.2 వేల కోట్లు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పునాది దాటి ఇప్పటికీ ముందుకు కదలడం లేదని, పూర్తి అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. స్వయంగా మంత్రి యనమల రామకృష్ణుడు సబ్కాంట్రాక్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన సిక్కోలు మత్స్యకారులు పాకిస్థాన్లో చిక్కుకున్నారని వారిని విడిపించేందుకు తమ పార్టీ తరఫున బాధితుల కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి వద్దకు త్వరలో తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. తితలీ నష్టం రూ.3,435 కోట్లయితే ప్రభుత్వం రూ.520 కోట్లే మంజూరు చేసిందని, అందులో సగం కూడా ఖర్చుచేయలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే బీసీలపై చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చిందని.. అందుకే నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని వెల్లడించారు.
చిలకపాలెం సభలో జగన్ మాట్లాడుతూ.. మంత్రి కళావెంకట్రావు కమీషన్ల వెంకట్రావుగా మారారని ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో కీలకపాత్ర పోషించి రూ. కోట్ల వెంకట్రావుగా మారారని విమర్శించారు. నారువా గ్రామంలో ఆయన కొడుకు ఎకరా రూ.50లక్షల విలువైన ప్రభుత్వ భూమిని రూ.2 లక్షలకే కారుచౌకగా కొట్టేశారన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూములను తనవిగా చూపించి రూ.30 కోట్లు నొక్కేశారని ఆరోపించారు.

Share this on your social network: