కేంద్ర పథకాలకు రాష్ట్రం ముద్ర
Published: Saturday March 30, 2019

‘‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపాలని అడిగితే.. మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు’’ అంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ‘ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన యూటర్న్ బాబు... కేంద్ర పథకాలకు తన స్టిక్కర్ వేసుకుని స్టిక్కర్ బాబు అయ్యారు’’ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో చేయాలని ఉంది. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రానికి సహకరించడంలేదు’’ అని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి చేసేందుకే పథకాలు రచిస్తున్నారని విమర్శించారు. ‘‘ప్రతి పనిలో, పథకంలో అవినీతి కనిపిస్తోంది. లెక్కలు చూపించాలి మీ చౌకీదార్ అడిగినందుకే మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకుని ఎన్డీయే నుంచి బయటికి వెళ్లారు. దేశంలోని తనలాంటి వాళ్లను కలుపుకొని.. బెయిల్ తీసుకుని కోర్టుల చుట్టూ తిరిగే వాళ్లతో కలిసి నన్ను ఓడించాలని తిరుగుతున్నారు. ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా... తమ మాటల ద్వారా పాకిస్థాన్లో హీరోలు కావాలని కోరుకుంటున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి యూటర్న్ బాబు పదేపదే అబద్ధాలు చెబుతున్నారు’’ అని మోదీ ధ్వజమెత్తారు.
‘ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఉదయించే సూర్యుడిని (సన్రైజ్) చూస్తారు! పుత్రోదయం (ఎస్వోఎన్-సన్రైజ్) చూడాలనుకుంటున్న వారి ఆశలను సమాధి చేయండి. ఆ తండ్రి కోరికను నెరవేర్చవద్దు’’ అంటూ పరోక్షంగా చంద్రబాబు-లోకేశ్లపై మోదీ ధ్వజమెత్తారు. ‘సన్రైజ్ కావాలా.. సన్సెట్ కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అదికారంలోకి వస్తే.. రెండు ఇంజన్ల రైలులా వేగంగా పని చేస్తామన్నారు. ‘‘ఇప్పటి వరకు చేసినదానికన్నా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అయితే.. యూటర్న్ బాబు రాష్ట్ర ప్రజలు, అభివృద్ధిపై కాకుండా తన కొడుకు సంక్షేమం కోసం పని చేస్తున్నారు. మీ చౌకీదార్(కాపలాదారుడు) మాత్రం మీ అభివృద్ధి కోసం.. మీ సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రె్సలది స్వార్థ, కు టుంబ రాజకీయం. వారి నుంచి ఈ దేశానికి, రాష్ట్రానికి రక్షణ కల్పించేందుకు నిరంతరం పోరాడుతూనే ఉంటాను’’ అని మోదీ ప్రకటించారు.

Share this on your social network: