వైసీపీ ఎంపీలందరి అజెండా రాష్ర్టానికి ప్రత్యేక హోదా
Published: Sunday May 26, 2019

యూనిఫామ్ ధరించిన పోలీస్ అధికారిగా స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలు గుర్తించా. వీలైనంత వరకూ వాళ్లకు న్యాయం చేశా. అదే నన్ను అనంతపురం జిల్లాలో గబ్బర్సింగ్ పోలీస్ ను చేసింది. ఇప్పుడు ఖాకీతోపాటు స్టేషన్ను వదిలేసి ఖద్దరు ధరించి పార్లమెంటుకు వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ భయంగా ఉంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విలేకరులతో అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంటుకు వెళుతున్న తనకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదని, వైసీపీ ఎంపీలందరి అజెండా రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించడమేనని చెప్పారు.
కరువు ప్రాంత ప్రజల కష్టాలపై మరింత అధ్యయనం చేసి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పోలీస్ అధికారిగా తానెప్పుడూ భయపడలేదని, తనను ఎంపీగా సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని తలచుకుంటే భయం వేస్తోందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడతానని చెప్పారు.
నిన్నటి వరకూ సీఐగా ఉన్న తనకు డీఎస్పీ స్థాయి అధికారి సెల్యూట్ చేశాడని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోను ఉద్దేశించి గోరంట్ల మాధవ్ స్పందించారు. తాను ముందు సెల్యూట్ చేశాకే పై అధికారి బదులుగా స్పందించారని వివరించారు. తాను ఎంపీనైనా తనకన్నా పై అధికారులు ఎదరుపడితే ఇకపై కూడా సెల్యూట్ చేస్తానన్నారు.

Share this on your social network: