38 దేశాలు తిరిగినా సాధించింది లేదు
Published: Tuesday July 16, 2019

విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అసెంబ్లీలో అధికార పక్షం ఆరోపించింది. టీడీపీ దీనిని తిప్పికొట్టింది. 2014 జూన్ నుంచి 2019 ఏప్రిల్ వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వివిధ దేశాలు చుట్టి వచ్చేందుకు 38 పర్యటనలు చేశారని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా లేవనెత్తారు.
రాష్ట్ర ప్రజలపై రూ.39 కోట్ల భారం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేదని, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడికి వెళితే అక్కడి అంశాలను రాష్ట్రానికి ఆపాదించారని, 2014 నవంబర్లో సింగపూర్ వెళ్లి ఏపీని టూరిస్ట్ హబ్గా చేస్తానన్నారని.. జపాన్ వెళ్లి ఏపీ యూనివర్సిటీల్లో జపనీస్ నేర్పిస్తామని.. చైనా వెళ్లి షాంఘైలా అమరావతి నిర్మాణం.. లండన్ వెళ్లి అమరావతి నిధుల సమీకరణకు స్టాక్ ఎక్స్ఛేంజ్ అంగీకరించినట్లు చెప్పారని.. చివరకు కజక్స్థాన్ వెళ్లి అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తామంటూ ఏ దేశానికి వెళితే అక్కడి విషయాలను వినిపించి కొరియాను సైతం వదలకుండా నిధులు నీళ్లలా ఖర్చు చేశారు తప్ప సాధించిందేమీ లేదన్నారు.
విదేశాలకు వెళ్లి చంద్రబాబు విజయ్ మాల్యాను కలిశారని ఆరోపించారు. పరిశ్రమల మంత్రి గౌతమ్రెడ్డి సమాధానమిస్తూ.. చంద్రబాబు గత ఐదేళ్లలో విదేశీ పర్యటన ఖర్చుల వివరాలు కేబినెట్ సబ్ కమిటీ వద్ద ఉన్నాయని చెప్పారు. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు తక్షణమే స్పందించారు. శాసనమండలిలో ఈ మంత్రే ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత ఐదేళ్లలో ఏర్పాటైన పరిశ్రమల వల్ల 5.13లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారని గుర్తుచేశారు. ఆ సంఖ్య వాస్తవమే కానీ.. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ చాలా పెద్దదని గౌతమ్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘వెరీగుడ్ ఒప్పుకొన్నందుకు.. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ఎంత కష్టపడ్డామో సీఎం సెక్రటరీని అడిగితే చెబుతారు’ అంటూ అచ్చెన్న సూచించారు.

Share this on your social network: