నాన్ పొలిటికల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

విశాఖఫట్నం, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి): రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు, సంఘాలు సమష్టిగా ఉద్యమిస్తేనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాకారమవుతుందని బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన నాన్ పొలిటికల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి నిర్మాణానికి సాయం, లోటుభర్తీకి గత ఎన్నికల ప్రచారసభలో ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నప్పటికీ ఆయా పార్టీల సిద్ధాంతాలు, ఎజెండాల కార ణంగా అంతా ఒకతాటిపైకి రాలేకపోతున్నారన్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు.
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేవలం ఉద్యోగ, ప్రజా సంఘాలు, రైల్వేజోన్ సాధన సమితి, ప్రత్యేక హోదా పోరాట సమితి వంటి సంఘాలతో నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. దీనికి తానే చొరవ తీసుకోవాలని నిర్ణయించి ఈ సమావేశానికి శ్రీకారం చుట్టానని గంటా పేర్కొన్నారు. రైల్వే జోన్ సాధనలో ఇది తొలి అడుగుగా అభివర్ణించారు. జేఏసీ ఏర్పాటుతో పాటు ఉద్యమం ఎలా చేయాలనేదానిపై కార్యాచరణ రూపొందించేందుకు అందరి నుంచి సలహాలు తీసుకుని వచ్చేనెల మూడున మరోసారి సమావేశమై జేఏసీ ఏర్పాటు, ఉద్యమానికి సంబంధించి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రైల్వే జోన్కు ఒడిశా అభ్యంతరం చెబుతుందనడంలో వాస్తవం లేదని, అక్కడి ఎంపీ దీనిపై ప్రకటన చేసిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. రైల్వే జోన్ను కొత్తగా అడగడం లేదని, గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అందరూ కలిసి ఉద్యమిస్తే సాధించలేనిదేదీ లేదని పేర్కొన్నారు. ఇందుకోసం తనవైపు నుంచి ఎలాంటి సహయం అందించేందుకైనా సిద్ధమేనని, అవసరం అనుకుంటే కఠినమైన నిర్ణయాలకు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రైల్వేజోన్ సాధనకు మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలను అమలు చేసే చిత్తశుద్ధి కేంద్రప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. రైల్వే జోన్ ప్రకటనకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తుందంటూ రాజకీయ దురుద్దేశాన్ని కొంతమంది పులుముతున్నారని పేర్కొన్నారు. అక్కడి ప్రభుత్వంతో తాము చర్చించామని, రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్ను ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారని, ఇప్పుడు దానిపై స్పందించేవారే కేంద్రంలో లేరంటూ నిట్టూర్చారు. రైల్వే మంత్రిగా రాంవిలాస్ పాశ్వాన్ పని చేసినప్పుడు రైల్వే లైనే లేని హాజీపూర్ కేంద్రం ఒకటి తర్వాత మరో రెండు డివిజన్లు ఏర్పాటుచేసిన విషయాన్ని కేంద్రంలోని పెద్దలు గుర్తు చేసుకోవాలన్నారు. ఏపీకి ఎన్నో చేశామంటున్న కేంద్రం వాదనలో వాస్తవం వుంటే పార్లమెంట్లో చర్చ పెట్టి వాటిని వివరించాలని కోరారు. ఏదీలేదు కాబట్టే చర్చ పెట్టడం లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు స్ఫూర్తిగా కడప ఉక్కు కోసం పోరాటం చేయాలన్నారు. వాల్తేరు డివిజన్ గత ఏడాది కంటే పది నుంచి 15 శాతం అధికంగా ఆదాయం సమకూర్చిందని, జోన్ వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చునన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా తెలియాలంటే ఏపీలోని 13 జిల్లాల్లో ఒకరోజు ఒక్క రైలు కూడా తిరగకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మాట్లాడుతూ ఉద్యమాలు విజయవంతం కావాలంటే కేవలం ప్రజల మద్దతే కాకుండా రాజకీయ వ్యవస్థ సహకారం కూడా తప్పనిసరి అని అన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సెంటిమెంట్ను గౌరవించాల్సిందేనన్నారు. హోదా డిమాండ్తో వచ్చేనెల తొమ్మిదిన తమ ఉద్యోగులంతా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్టు పేర్కొన్నారు. జోన్పై పార్లమెంట్లో నిలదీయాల్సిన రాష్ట్ర ఎంపీలు ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్లు వ్యవహరిస్తున్నారని, దీనివల్లే కేంద్రం చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకూ బీజేపీ ఎలాంటి హామీలను నెరవేర్చదని అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాలకు తమ సంఘం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

Share this on your social network: