టీడీపీతో చర్చలో గెలవలేకే రుబాబు

‘నేను అన్నాను... అది జరిగిపోవాలి..’ అనే ధోరణిలో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు సబ్బం హరి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మాదిరిగానే, బీఫారం తీసుకోవడానికి కూడా వైసీపీలో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వర్తమాన రాజకీయ అంశాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ గురువారం నిర్వహించిన ‘ది డిబేట్’లో ఆయన పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారనే అక్కసుతో శాసన మండలిని రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారని, మరిప్పుడు మళ్లీ మండలికి ఎందుకు వెళ్లారని సబ్బం హరి ప్రశ్నించారు. ‘‘మండలిలో అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును పక్కనపెట్టేసి...రాజధాని బిల్లును ముందు పెట్టడాన్ని బట్టి రాజధాని తరలింపుపై వైసీపీ ఎంత ఆత్రుతగా ఉందో అర్థమవుతోంది. వైసీపీ సభ్యులకు చట్టంపై అవగాహన లేదు. టీడీపీ సభ్యులేమో చట్టాలను ఔపోసన పట్టేసినవాళ్లు. దీంతో చర్చతో కాకుండా రుబాబు చేసి బిల్లును ఆమోదించుకోవాలని జగన్ డైరెక్షన్లో వైసీపీ సభ్యులు డ్రామాలు ఆడారు. పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అందుకే టేపులు బయటపెట్టాలని టీడీపీ సభ్యులు కోరినా అంగీకరించడం లేదు’’ అని పేర్కొన్నారు.

Share this on your social network: