దృష్టి మళ్లించేందుకే మోదీపై విమర్శలు

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన సీఎం చంద్రబాబు వారి దృష్టిని మళ్లించేందుకే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జీవీఎల్ మాట్లాడుతూ గుజరాత్లోని ధొలేరా సిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ధొలేరాకు కేంద్ర ప్రభుత్వం 1293 కోట్లు మాత్రమే ఇవ్వగా, రూ.98 వేల కోట్లు ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నా రాష్ట్రం అక్రమాలకు పాల్పడుతోందని, సహకరించని అధికారులను ప్రాజెక్టు నుంచి తప్పిస్తోందని ఆరోపించారు.

Share this on your social network: