మోదీది నిరంకుశ పాలన
Published: Tuesday November 20, 2018

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలంటే.. కాంగ్రెస్కే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం నెల్లూరులో ఇందిరాగాంధీ శతజయంత్యుత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. హోదా, విభజన హామీలు అమలు చేస్తామన్న ప్రధాని మోదీ వాటిని విస్మరించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఇటీవల తన వైఖరిని స్పష్టం చేశారన్నారు. దివంగత ఇందిరా గాంధీ వల్లే దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. బీజేపీలాంటి పార్టీలకు చెప్పుకోవడానికి ఏమీలేదని.. త్యాగాలకు చిరునామా కాంగ్రెస్ మాత్రమేనని కొనియాడారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆర్బీఐని నిర్వీర్యం చేయడం వల్ల బ్యాంకుల్లో పేదవారికి అప్పులు ముట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. సీబీఐని కేంద్రం స్వప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. మైనారిటీలు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడూ పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.50-60కి మించలేదని.. బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ.90కి పెంచిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పాలన వస్తే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని చెప్పారు. టీడీపీ నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి ఉండి.. మోదీ వ్యవహార శైలి తెలుసుకుని రాహుల్తో చేతులు కలిపి యూపీఏకి మద్దతు ప్రకటించడం అభినందనీయమని మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి చెప్పారు.
ఈ పని ముందుగానే చేసి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆమెను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చని అప్పటి కాంగ్రెస్ నేతలు భావించారన్నారు. అయితే ఆమె దుర్గామాతలా తన ప్రతాపం చూపించిందని తెలిపారు. ఇందిరాగాంధీ ఒక శక్తి అని, పేద పీడిత వర్గాలకు ఆమె అండగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. రాహుల్ను ప్రధాని చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనేనన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టొఫర్, మెయ్యప్పన్, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

Share this on your social network: