ఎంపీల ఆందోళనకు మద్దతుగా సచివాలయం ఉద్యోగులు ఆందోళన

Published: Friday February 09, 2018

అమరావతి: పార్లమెంటు ఎంపీల ఆందోళనకు మద్దతు తెలుపుతూ శుక్రవారం వెలగపూడిలోగల సచివాలయంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించాలని తీర్మానించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. విభజన హామీలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు గత మూడు రోజులుగా పార్లమెంటు లోపల, బయట ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఎంపీలకు మద్దతుగా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా సచివాలయం ఉద్యోగులు తీసుకున్న నిర్ణయంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయనున్నట్లు సమాచారం.