కరోనా సెకండ్ వేవ్‌లో 624 డాక్టర్లు మృతి!

Published: Saturday June 05, 2021

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడే క్రమంలో ఎందరో డాక్టర్లు అసువులు బాశారు. వీరి లెక్కలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. మొత్తమ్మీద కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 624 మంది వైద్యులు కన్నుమూసినట్లు ప్రకటించిన ఐఎంఏ.. వారిలో అత్యధికులు దేశరాజధాని ఢిల్లీలోనే మరణించినట్లు తెలిపింది. ఢిల్లీలో ఏకంగా 109 మంది వైద్యులు మృతిచెందగా.. బిహార్‌లో 96 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది డాక్టర్లు కరోనా పోరులో మృత్యువాత పడినట్లు ఐఎంఏ వెల్లడించింది. గతేడాది కూడా కరోనా మన డాక్టర్లను భారీగానే కబళించింది. కరోనా తొలివేవ్ వచ్చిన గతేడాది మన దేశంలో 748 మంది డాక్టర్లు కన్నుమూసినట్లు ఐఎంఏ గుర్తుచేసింది.