తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత

కొత్త మెడికల్ కాలేజీలపై అంతా హడావుడి, ఆర్భాటమే! స్థలాలపై వివాదాలున్నా శంకుస్థాపనలు చేసేశారు. నిధుల కోసం రకరకాల గిమ్మిక్కులు చేస్తూ... ఆరోగ్యశ్రీ, బీమా పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే... అసలు కొత్త మెడికల్ కాలేజీల్లో పాఠాలు చెప్పేందుకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా? ఈ అంశం అన్నింటికీ మించి కలవర పెడుతోంది. ఎందుకంటే.. ఇప్పుడున్న బోధనాస్పత్రులనే సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తామంటున్న 16 మెడికల్ కాలేజీలకు 4,400 మంది వైద్యులు, 5,000 మంది నర్సింగ్, 8 వేల మంది పారామెడికల్ సిబ్బంది.... మొత్తం 17,000 మంది అవసరం. ఈ స్థాయిలో నియామకం సాధ్యమేనా? అని వైద్య నిపుణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఏలూరు, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వానికి సంబంధించిన మెడిక ల్ కాలేజీలు నడుస్తున్నాయి. ఈ కాలేజీల్లో ఎఫ్ఎన్వో ల నుంచి ప్రొఫెసర్ల వరకూ తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి మెడికల్ కాలేజీలోనూ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ప్రొఫెసర్ పోస్టు ఖా ళీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో 550 మంది ప్రొఫెసర్లు, 554 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1,919 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఐదు వేల మంది స్టాఫ్ నర్సులు, 6,500 మంది పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించేందుకు ప్రతి రెండుమూడేళ్లకోసారి వైద్యుల నియామకాలు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ కావడం లేదు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, కొత్త మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కొత్తగా 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది. వీటికి రాష్ట్రంలో సిబ్బంది దొరికే పరిస్థితి ఉందా? అని వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భవనాల నిర్మాణాలతో వైద్య పరికరాలు, ఫ్యాకల్టీ చాలా ముఖ్యం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రచా రం 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న మెడికల్ కాలేజీకి 275 మంది బోధనా సిబ్బంది అవసరం. 150 ఎంబీబీఎస్ సీట్లకు 302 మంది, 200 ఎంబీబీఎస్ సీట్లకు 342 మంది, 250 ఎంబీబీఎస్ సీట్లకు 364 మంది బోధనా సిబ్బంది కావాలి. మన రాష్ట్రంలో నిర్మిస్తున్న 16 బోధనాసుపత్రుల్లో ఎక్కువగా ఎంబీబీఎస్ సీట్లతోనే ప్రారం భం కానున్నాయి. మచిలీపట్నం లాంటి కొన్ని కాలేజీలు మినహా మిగిలిన కాలేజీలు 100 సీట్లతో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 16 మెడికల్ కాలేజీల్లో సగటున వంద సీట్లు చొప్పున లెక్కిస్తే, 4,400 మంది బోధనా సిబ్బంది(వైద్యులు) అవసరం. కొత్త మెడికల్ కాలేజీల్లో 10 క్లినికల్ విభాగాలుంటే, 16 నాన్ క్లినికల్ విభాగాలుంటాయి. ప్రతి విభాగానికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కచ్చితంగా ఉండాలి. ఈ లెక్కన కొత్త మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించేందుకు 1,000 మంది ప్రొఫెసర్లు, 1,500 మంది వరకూ అసోసియేట్ ప్రొఫెసర్లు, 3,000 వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. ఒక కార్డియాలజి్స్టకు ప్రైవేటు సెక్టార్లో నెలకు రూ.3-4 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ప్రభుత్వ సెక్టార్లో నెలకు రూ.50-55 వేలజీతం మాత్రమే ఇస్తోంది. దీంతో డాక్టర్లు వచ్చే పరిస్థితి ఉండదు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నిలుపుకోవడానికి ఆరోగ్యశాఖ ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యం ఉపయోగించే ట్రిక్ను అమలు చేస్తోంది. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో ప్రైవేటు కాలేజీలు బయటి నుం చి ఫ్యాకల్టీని తీసుకువస్తాయి. తనిఖీలు పూర్తయిన వెంటనే ఆ ఫ్యాకల్టీకి కొంత డబ్బులిచ్చి వెనక్కి పంపించేస్తాయి. వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ ఫ్యాకల్టీని తనిఖీల సమయంలో పంపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్తగా నిర్మించే కాలేజీలు పట్టణాలకు సుదూరంగా ఉన్నాయి. వీటిలో విధులకు స్పెషాలిటీ వైద్యులు ముందుకు వస్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పారా మెడికల్ బోర్డు పూర్తి గా నిర్వీర్యమైంది. ఈ కోర్సులకు ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు విడుదల చేయ డం లేదు. పారా మెడికల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తెలంగాణకు వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో 400కు పైగా జీవో, నాన్ జీవో ఆధారిత పారా మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిల్లో సీట్లకు మాత్రమే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో దాదాపు 10 వేల పారామెడికల్ సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మూడేళ్లుగా బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారు.

Share this on your social network: