ఈటల గెలుపు తథ్యం: బండి సంజయ్‌

Published: Thursday September 02, 2021

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అవినీతి పాలన సాగిస్తున్నారని, ఆయన్ను జైలుకు పంపేది బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర జరిగింది. మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాత్రి 7 గంటలకు చేవెళ్లకు చేరుకుంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ తలకాయ కిందికి కాళ్లు మీదికి చేసినా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలుపును ఆపలేరని అన్నారు.

 

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేసే రోజున రాష్ట్రంలో జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు. ప్రాణహిత స్థూపం అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నాటిన మొక్క పెరిగి పెద్దదైంది కానీ.. ప్రాజెక్టు పనులు మాత్రం ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారితే.. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లను, హిందువుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని అన్నారు.