పోలీసుల అదుపులో నారా లోకేష్‌

Published: Thursday September 09, 2021

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇవాళ ఉదయం నుంచి లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో పలువురు తెలుగు తమ్ముళ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు.. లోకేష్ వస్తున్నారని తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను పరామర్శించడానికి గుంటూరు వెళ్లారు. నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. అయితే.. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.