మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

Published: Sunday August 16, 2020

భారత జట్టు మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ ఆదివారంనాడు హర్యానాలోని గురుగావ్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కోవిడ్-19 చికిత్స కోసం ఇటీవల ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు. శనివారంనాడు ఆయన ఆరోగ్యం విషమించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన సైనిక సంక్షేమం, హోం గార్డ్స్, పౌర భద్రత, ప్రాంతీయ రక్షాదళ్ మంత్రిగా ఉన్నారు. చౌతన్ చౌహాన్ మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

చేతన్ చౌహాన్ 1970 దశకంలో భారత క్రికెట్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించారు. సునీల్ గవాస్కర్‌తో కలిసి ఓపెన్ బ్యాటింగ్‌కు దిగేవారు. 1969లో తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడారు. 40 టెస్ట్‌లు ఆడి 2,084 పరుగులతో 31.37 రన్‌రేటు సాధించారు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 12 ఏళ్ల తన కెరీర్‌లో 7 వన్నే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడి 153 పరుగులు చేశారు. సిడ్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 46 పరుగులు చేశారు. ఒక్క సెంచరీ కూడా చేయకుండా 2000 పరుగులు చేసిన తొలి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆయనే కావడం విశేషం. 1981లో అర్జున్ అవార్డు అందుకున్నారు. రెండుసార్లు యూపీలోని అమ్రోహి నుంచి లోక్‌సభకు చేతన్ చౌహాన్ ఎన్నికయ్యారు.