దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్

Published: Monday January 04, 2021

భారతదేశంలో త్వరలోనే అతిపెద్ద కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారంనాడు నేషనల్ మెట్రోలజీ కాంక్లేవ్-2021‌ను ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. నూతన సంవత్సరంలో దేశంలో రెండు కోవిడ్ వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధి పరచిన భారతీయ శాస్త్రవేత్తలను ఆయన à°ˆ సందర్భంగా అభినందించారు. భారతదేశం చేపట్టబోయే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమమని, ఇది త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు.

నేషనల్ ఆటోమేటిక్ టైమ్‌స్కేల్, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రజలకు మోదీ అంకింతం చేశారు. జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబెరేటరీకి శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో శాస్త్రవేత్తలు ముఖాముఖీ జరిపి, సంస్థ సాధిస్తున్న విజయాలను వారికి తెలియజేయాలని, వారిని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్దిదిద్దేందుకు కృషి చేయాలని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)ను ప్రధాని కోరారు. దేశం ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకు కలిసికట్టుగా పరిష్కారం కనుగొనేందుకు సీఐఎస్ఆర్‌ సహా దేశంలోని సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్లు చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. సీఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ లేబరేటరీ (ఎన్‌పీఎల్) కృషిని కూడా ప్రధాని కొనియాడారు. గతంలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావడానికి ఇవాల్టి సదస్సులో జరిగే చర్చలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధ భారతం దిశగా కొత్త ప్రమాణాలు నెలకొల్పడం, కొత్త విజయాలు సాధించడంలో సంస్థ కీలక భూమిక పోషించాలని మోదీ పిలుపునిచ్చారు.