బదిలీపై వెళుతున్న జీవీఎంసీ కమిషనర్ సృజన
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ డాక్టర్ జి.సృజనకు బదిలీ అయ్యింది. ఆమెను పరిశ్రమల శాఖ డైరెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె స్థానంలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేస్తున్న 2013 బ్యాచ్కు చెందిన డాక్టర్ జి.లక్ష్మీషాను నియమించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి జిల్లా జాయింట్ కలెక్టర్గా వున్న డాక్టర్ జి.సృజన 2019 జూన్ 19న జీవీఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు. ఆమె తనదైన శైలిలో పాలన సాగించారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేసిన సిఫారసులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ఆమె విధులు నిర్వర్తించే వారనే అభిప్రాయం మాత్రం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతోపాటు నగరవాసుల్లో కూడా ఏర్పడింది. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందురోజు ఆమె సెలవుపై వెళ్లిపోయారు. అయితే జిల్లాలో మూడేళ్లకుపైగా పనిచేస్తున్న అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం బదిలీ చేయవలసి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో సృజనను బదిలీ చేసి ఆమె స్థానంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా వున్న నాగలక్ష్మిని నియమించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే తిరిగి సృజనను జీవీఎంసీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవీఎంసీ కార్యవర్గం ఏర్పడిన తర్వాత కమిషనర్కు ఎదురుగాలి మొదలైంది. మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఇంటి వద్ద కారు పార్కింగ్ కోసం గ్రీన్బెల్ట్ తొలగించడాన్ని అడ్డుకోవడం, నగరంలో లీజు మొత్తాలు చెల్లించని జీవీఎంసీ దుకాణాలను సీజ్ చేయడం వంటి నిర్ణయాలు ఆమెను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు దూరం చేశాయి. ఈ నేపథ్యంలో మేయర్తోపాటు కొంతమంది కార్పొరేటర్లు తమను కమిషనర్ అసలు పట్టించుకోవడం లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ పలుమార్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ తమ మాట కూడా వినడం లేదని మంత్రి ముత్తంశెట్టి, మరికొందరు ప్రజా ప్రతినిధులు కూడా విజయసాయిరెడ్డికి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేసి వుండడంతో ఆమె బదిలీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే తరుణంలో సృజన కూడా తాను ఇంకా విశాఖపట్నంలో కమిషనర్గా కొనసాగలేనని, ఇంకేదైనా చోటకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెను బదిలీ చేసినట్టు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది.
విశాఖలో పనిచేసిన ఐదేళ్ల కాలం తనకు ప్రత్యేకమైనదని బదిలీపై వెళుతున్న డాక్టర్ జి.సృజన అన్నారు. దాదాపు ఐదేళ్లపాటు పనిచేసిన కాలంలో వ్యక్తిగా తానెంతో పరిణతి చెందానని వివరించారు. ఒక వ్యక్తిగా, అధికారిగా, విద్యార్థిగా, తల్లిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించానన్నారు. తనను ఇంతగా ఆదరించిన సుందర విశాఖ నగరానికి, నగర వాసులు, అధికారులకు, జిల్లా ప్రజలకు జీవీఎంసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Share this on your social network: