చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైంది.

Published: Wednesday July 04, 2018
చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైంది. చోడవరం వేదికగా చెబుతున్నా.. 2019లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని కానివ్వం’ అని జనసేన అధ్యక్షడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరం, అనకాపల్లిల్లో మంగళవారం జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అవినీతిపరులు, దోపిడీదారుల చేతుల్లోకి పోకూడదనే నాడు చంద్రబాబుకు మద్దతిచ్చానని.. అధికారంలోకి వచ్చాక దోపిడీ ఎలా ఉంటుందో చంద్రబాబు తారస్థాయిలో చూపించారని ఆరోపించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని, వీటిని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
 
‘మరోసారి సీఎంగా తననే ఎన్నుకోవాలని చంద్రబాబు అడుగుతున్నారు. అయితే ఎందుకు ఎన్నుకోవాలి? విశాఖ భూకుంభకోణంపై సిట్‌ సమర్పించిన నివేదికను వెల్లడించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఉండడం వల్లే బయటపెట్టడం లేదు’ అని పవన్‌ ధ్వజమెత్తారు.